న్యూఢిల్లీ: కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని వదులుకోవాలి. కలలను నిజం చేసుకోవడానికి కొందరు అనేక త్యాగాలకు సిద్ధపడతారు. ఆ కోవకు చెందిన వాడే రాజస్థాన్లోని అల్వార్ జిల్లావాసి గౌరవ్ యాదవ్. జిల్లాలోని జాజోర్-బాస్ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టిన గౌరవ్ యాదవ్కు దేశమంటే పిచ్చిప్రేమ. దేశ సేవే అతడి మొదటి ప్రాధాన్యం. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ చురుగ్గా ఉండేవాడు. హర్యానా రేవరిలోని కేరళ పబ్లిక్ స్కూల్లో చదువుతూ టెన్త్లో 96 శాతం మార్కులతో ఏ ప్లస్ గ్రేడ్ సాధించాడు.
ఢిల్లీలో కాలేజీలో చేరిన యాదవ్.. ఆర్మీలో చేరి దేశసేవ చేయాలనే తన కలను నిజం చేసుకోవడానికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ఎంట్రెన్స్ టెస్ట్ రాసేవాడు. రెండుసార్లు దానిని క్లియర్ చేశాడు. కానీ, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. మూడోసారి ఇంటర్వ్యూలోనూ విజయం సాధించాడు. ఈ క్రమంలో ఐఐటీ ఎంట్రెన్స్లోనూ ఉత్తమ ర్యాంకు సాధించాడు. కానీ, ఆర్మీలో చేరాలనే లక్ష్యంతో ఐఐటీ ర్యాంకు విషయం తల్లిదండ్రుల వద్ద దాచాడు. ఎన్డీఏలో ప్రవేశం పొందాక వారికి ఆ విషయం చెప్పాడు. బుధవారం ఎన్డీఏ 143వ కోర్సులో రాష్ట్రపతి బంగారు పతకాన్ని సైతం గెలుచుకున్నాడు.