IIT Madras | చెన్నై, అక్టోబర్ 16: ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. వైద్య పరికరాలను స్టెరిలైజ్ (క్రిమి రహితం) చేసేందుకు ఓ ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేశారు. సౌర శక్తితో వాడుకొని పని చేసే ఆవిరి ఆధారిత స్టెరిలైజ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరికరాన్ని ఓ చోట నుంచి మరో చోటకు తరలించే వీలు ఉండటం మరో విశేషం. ఐఐటీ-మద్రాస్లోని మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ ప్రొఫెసర్ సత్యం సుబ్యయ్య నేతృత్వంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
సులువుగా స్టెరిలైజేషన్…
సౌర శక్తితో పని చేసే ఈ పోర్టబుల్ పరికరం ఆవిరిని ఉత్పత్తి చేసి స్టోర్ చేసుకుంటుంది. తద్వారా శస్త్రచికిత్సలు చేసేందుకు వాడే వైద్య పరికరాలను సులువుగా స్టెరిలైజ్ చేసుకోవచ్చు. దీని వల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా శస్త్రచికిత్సలు చేయవచ్చు. ఈనెల 14న జరిగిన మెడికల్ క్యాంపులో దీన్ని ప్రదర్శించారు. నీరు, విద్యుత్తు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేటప్పుడు శస్త్రచికిత్సకు వినియోగించిన వైద్య పరికరాల స్టెరిలైజేషన్ సవాలుగా మారుతున్నది. స్టెరిలైజేషన్ సులువుగా మారితే ఎక్కువ మందికి సేవలు అందించే వీలు కలుగుతుంది.