IIT Jodhpur | జోధ్పూర్, జనవరి 26: రోడ్లు ఎలా ఉన్నాయ్? ట్రాఫిక్ జామ్ ఏర్పడిందా? ఆ మార్గంలో యాక్సిడెంట్లు ఏమన్నా జరిగాయా? ఇలాంటి విషయాలను వాహనాలు పంచుకుంటాయ్! తద్వారా ట్రాఫిక్ రద్దీతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయ్!! ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అవును మీరు చదివింది నిజమే. ఇంటర్నెట్ ఆఫ్ వెహికిల్స్ (ఐఓవీ) నెట్వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకొనే సరికొత్త టెక్నాలజీని ఐఐటీ జోధ్పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు.
నావెల్ ఎంఏసీ బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్ (నోమాస్) అనే సాంకేతికతను అభివృద్ధి చేసి వాహనాల్లో ఇన్స్టాల్ చేశారు. దీని ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల మధ్య రియల్టైంలో సమాచార బదిలీ జరిగి తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ జోధ్పూర్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దేబాశిష్ దాస్ తెలిపారు. వాహనాల దొంగతనం, అనధికార వినియోగానికి ఈ సాంకేతికతతో చెక్ పెట్టొచ్చని వెల్లడించారు.