గువాహటి: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థల్లో ఐఐటీ గువాహటి ఒకటి. ఆ క్యాంపస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్గా మార్చారు. ఐఐటీలో ఇప్పటివరకు 60 మంది కరోనా బారినపడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐఐటీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. క్యాంపస్ నుంచి ఏ ఒక్కరు బయటకు రావడానికిగానీ, లోపలికి వెళ్లడానికి గానీ అనుమతించమని చెప్పారు.
అసోంలో మొదటి ఒమిక్రాన్ కేసులు బుధవారం వెలుగుచూసింది. సౌదీ అరేబియా నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అదేవిధంగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 591 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి లక్షకు చేరువయ్యాయి. కొత్తగా 90,928 మందికి కరోనా సోకింది. ఒకేరోజులో ఇంతభారీ సంఖ్యలో కేసులు నమోదవడం గత 2 వందల రోజుల్లో ఇదే మొదటిసారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసులు 3,51,09,286కు పెరిగాయి.