IIT Bombay | ప్రస్తుతం సోషల్ మీడియా కొనసాగుతున్నది. పలు అంశాలపై తమ తమ అభిప్రాయాలును సెలబ్రిటీల నుంచి సాధారణ జనాల వరకు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఎక్కడ ఏ చిన్న తప్పు కనిపించినా ట్రోల్స్ చేస్తూ ఓ ఆట ఆడేసుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది ట్రోల్కు గురవగా.. తాజాగా ఐఐటీ బాంబే సైతం ట్రోల్స్ బారినపడింది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోనే.
ప్రస్తుతం దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇటీవల ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 13-15 మధ్య ప్రజలు తమ ఇళ్లలో జాతీయ జెండాను ప్రదర్శించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎంతో మంది, సంస్థలు భవనాలపై జాతీయ జెండాను ఏర్పాటు చేశాయి.
అయితే ఐఐటీ బాంబే సైతం ఫేస్బుక్ కవర్గా పెట్టిన ఫొటోలు జాతీయ జెండా ఫొటోషాప్లో ఎడిట్ చేశారంటూ విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఇప్పటి వరకు ఐఐటీ బాంబే ఫేస్బుక్ పేజీలోని కవర్ ఫొటోపై 2600పైగా స్పందనలు.. 290కిపైగా కామెంట్లు రాగా, 590 మంది షేర్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
‘ఐఐటీలో గ్రాఫిక్ కోర్సు ప్రారంభించాల్సిన సమయం ఇది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘ఐఐటీ బాంబే ఎంత అడ్వాన్స్డ్ టెక్ ఇన్స్టిట్యూట్ అంటే మంచి ఫోటోషాప్ చేయలేం’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘మీరు ఫొటోషాప్లో జెండాను ఎడిట్ చేస్తారా? నిధులు కొరత ఉందా? అప్పుడు మీరు ఎన్ఈపీ (నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ)ని వ్యతిరేకించాలి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.