చెన్నై : తమిళనాడులో ఆదివారం నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది. ఆయా కార్యక్రమాలపై మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మరో వైపు సింగిల్ జడ్జి బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు సిద్ధమైంది. మద్రాస్ హైకోర్టు తమిళనాడులోని 44చోట్ల సంఘ్ కార్యక్రమాలకు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.
సంఘ్ 50 చోట్ల ర్యాలీల నిర్వహణకు ఆర్ఎస్ఎస్ అనుమతి కోరింది. ఈ నెల 6న 44చోట్ల కవాతు, బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు సంఘ్కు అనుమతి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం తమిళనాడు పోలీసులను ఆదేశించింది. కోయంబత్తూరు, మెట్టుపాళయం, పొల్లాచ్చి, తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం, కన్యాకుమారి జిల్లాలోని అరుమనై, నాగర్కోయిల్లో ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఆయా ప్రదేశాల్లో పరిస్థితి సరిగా లేనందున అనుమతి నిరాకరించింది. మరో వైపు షరతులను పాటించకపోతే అవసరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది.
సంఘ్ ర్యాలీల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన సంస్థలకు అనుకూలంగా, అలాగే దేశ స్వయంప్రతిపత్తి, సమగ్రతను ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడొద్దన చెప్పింది. అలాగే ర్యాలీలో పాల్గొనే కార్యకర్తలు కర్రలు, ఇతర హానికారక ఆయుధాలపై సైతం ఆంక్షలు విధించింది. ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే సంఘ్ ద్వారానే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవచ్చు అంటూ మద్రాస్ హైకోర్టు బెంచ్ పేర్కొంది.