పట్నా: దేశంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వియాదవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థితిగతులు, వాతావరణం చాలా దారుణంగా ఉన్నాయన్నారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిపై కళంకితులు, అవినీతిపరులంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. వారిపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయని విమర్శించారు.
తప్పుడు ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దాడులు చేయించి ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వాన్ని హత్య చేస్తున్నారని, అయినా లొంగకపోతే తప్పుడు కేసులతో జైలుకు పంపుతున్నారని తేజస్వి మండిపడ్డారు. కానీ, బీజేపీతో కలిసి నడిస్తే మాత్రం వాళ్లు సత్యాహరిశ్చంద్రులు అయిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఓ నాయకుడిపై ఎన్ని అవినీతి మరకలు ఉన్నా సరే బీజేపీలో చేరడమో, బీజేపీకి మద్దతు నిలవడమో చేస్తే చాలు పునీతుడైపోతాడని విమర్శించారు. అలాంటి నేతలను బీజేపీ వాషింగ్ మెషిన్లో వేసి శుభ్రం చేస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బీహార్ రాజధాని పట్నాలో సీపీఐ-ఎం 11వ జనరల్ కన్వెన్షన్లో తేజస్వి యాదవ్ మాట్లాడారు. అందరం కలిసి భారత రాజ్యాంగానికి కాపాడుకోవడానికి పోరాడుదామని సభికులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.