న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ ( Pegasus Snooping) నిఘా అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని, హ్యాకింగ్కు సంబంధించిన అన్ని అంశాలను బహిర్గతం చేయాలని ఇప్పటి వరకు సుప్రీంలో 9 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసినవారిలో అడ్వాకేట్ ఎంఎల్ శర్మ, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ద హిందూ గ్రూపు డైరక్టర్ ఎన్ రామ్, ఆసియానెట్ ఫౌండర్ శవి కుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, జగదీప్ చోకర్, నరేంద్ర మిశ్రా, రూపేశ్ కుమార్ సింగ్, ఈప్సా శతాక్షి, పరంజయ్ గుహ్ థాకుర్త, ఎస్ఎన్ఎమ్ అబ్ధి, ప్రేమ్ శంకర్ జాలు ఉన్నారు.
ఇవాళ సుప్రీంలో ఈ కేసును చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం విచారించింది. పత్రికల్లో వచ్చిన కథనాలు కాకుండా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని సీజే ప్రశ్నించారు. ఈ కేసులో ఎన్ రామ్ తరపున సీనియర్ అడ్వకేట్ సిబల్ వాదించారు. పెగాసస్ స్పైవేర్ ఓ దారుణమైన టెక్నాలజీనఇ, అది మనకు తెలియకుండానే మన జీవితాలను నాశనం చేస్తుందన్నారు. మన ఫోన్లలోకి ప్రవేశించే ఆ స్పైవేర్తో వ్యక్తిగత జీవితాలు, దేశ రహస్యాలు బట్టబయలు అవుతాయని సిబల్ అన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు నిజమే అయితే అప్పుడు ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు సీజే రమణ తెలిపారు. అయితే పలువురు దాఖలు చేసిన రిట్ పిటీషన్లలో అంశాలు సరిగా లేవని, అనుభవజ్ఞులు పిటిషన్ దాఖలు చేసినట్లుగా లేదని సీజే అన్నారు. ఫోన్లు హ్యాక్ అయినట్లు చెబుతున్న కొందరు.. మరెందుకు క్రిమినల్ కేసును దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.
స్పైవేర్ టెక్నాలజీని కేవలం గవర్నమెంట్ ఏజెన్సీలకు మాత్రమే అమ్ముతారని, దాన్ని ప్రైవేటుగా అమ్మలేరని సిబల్ తెలిపారు. ఎన్ఎస్ఓ టెక్నాలజీ కంపెనీ అంతర్జాతీయంగా హ్యాకింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కాలిఫోర్నియా కోర్టులో ఎన్ఎస్ఓపై దాఖలు అయిన ఓ పిటిషన్ గురించి సిబల్ సుప్రీం ధర్మాసనానికి వివరించారు. స్నూపింగ్ జాబితాలో భారతీయ జర్నలిస్టులు ఉన్నట్లు ఎన్ రామ్ వేసిన అఫిడవిట్లో ఉందని, మరి వారికి సమాచారం ఎక్కడ నుంచి వచ్చిందని సీజే ప్రశ్నించారు. సుప్రీంకోర్టులోని రిజిస్ట్రార్ల ఫ్లోన్లు కూడా హ్యాక్ అయినట్లు సిబల్ అన్నారు. అయితే వారి పేర్లు చెప్పవద్దు అని, నిజం బయటకు వస్తుందని సీజే తెలిపారు. ఫోన్ హ్యాకైనట్లు తెలిస్తే.. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రశ్నించారు.
పెగాసస్పై కోర్టుకు విచారణకు కేంద్ర ప్రభుత్వ హాజరుకాలేదని, ప్రభుత్వ వాదన లేకుండా ఈ కేసులో ముందుకు వెళ్లలేమని, ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 10వ తేదీన ఉంటుందని సీజే తెలిపారు. కేసును విచారించిన సుప్రీం ధర్మాసనంలో మరో జడ్జిగా జస్టిస్ సూర్య కాంత్ ఉన్నారు.