ముంబై: మనం ఈసారి తప్పు చేస్తే, దేశంలో నియంతృత్వం నెలకొంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సోమవారం తూర్పు ముంబైలోని కుర్లాలో జరిగిన జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 2024 లోక్సభ ఎన్నికల గురించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. భారతదేశ ద్వారానికి నియంతృత్వం చేరిందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘దేశం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. దేశాన్ని ఎవరు కాపాడతారు? ఈసారి మనం తప్పు చేస్తే దేశంలో నియంతృత్వం వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
కాగా, దేశానికి మరో స్వాతంత్ర్యం కావాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం మనం పోరాడాం. ఇప్పుడు ఈ స్వేచ్ఛను కాపాడుకోవడానికి పోరాడాలి. నేను చేయగలిగినదంతా చేస్తా. దేశంలో గందరగోళ వాతావరణం ఉంది. మన తలుపు వరకు నియంతృత్వం వచ్చింది. మనమంతా దానిని ఆపాలి’ అని అన్నారు.
మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని ప్రజలను ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ‘నేను మీ ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చాను. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. నాకు నా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది. వారు గర్వించేలా చేయాలనుకుంటున్నా. దేశం కోసం.. మీ ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చా’ అని అన్నారు. జైన మతాచార్యుల ఆశీర్వాదాన్ని ఆయన కోరారు.