Adhir Ranjan: తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ను లోక్సభ అభ్యర్థిగా బెర్హంపూర్ పార్లమెంట్ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బెర్హంపూర్ ప్రస్తుత ఎంపీ అధిర్ రంజన్ చౌధరి స్పందించారు. నిజంగా యూసఫ్ పఠాన్ను గౌరవించాలనే ఉద్దేశం టీఎంసీకి ఉంటే ఆయనను రాజ్యసభకు పంపాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ బయటి వ్యక్తులను బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపిందని, వారికి బదులుగా యూసఫ్ పఠాన్ను పంపితే బాగుండేదని అధిర్ రంజన్ అభిప్రాయపడ్డారు.
నిజంగా యూసఫ్ పఠాన్ విషయంలో టీఎంసీకి సదుద్దేశమే ఉంటే తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఆయన కోసం ఒక సీటు కావాలని ఇండియా కూటమిని అడగాల్సిందని అధిర్ రంజన్ అన్నారు. కేవలం సామాన్య ఓటర్లను మాయచేసి బీజేపీకి లబ్ధి చేకూర్చడం కోసమే యూసఫ్ పఠాన్ను బెర్హంపూర్ నుంచి బరిలో దించారని ఆయన ఆరోపించారు. తన లాంటి నాయకురాలిని ఎవరూ నమ్మగూడదనే విషయాన్ని ఇవాళ మమతాబెనర్జి రుజువు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమిలో కొనసాగితే ప్రధాని మోదీ బాధపడుతారని మమతాబెనర్జీ భయపడుతున్నారని అధిర్ రంజన్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు తాను ఇండియా కూటమి నుంచి పక్కకు జరగడం ద్వారా మమత పీఎంవోకు ‘నా వల్ల మీరు ఎలాంటి బాధపడొద్దు’ అనే సందేశం ఇచ్చారని, తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటం లేదని చెప్పకనే చెప్పారని ఆయన విమర్శించారు.