న్యూఢిల్లీ: ఖతార్లో భారత రాయబారి దీపక్ మిట్టల్ తాలిబన్ నేత షేర్ మహ్మద్ను కలవడంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ తాలిబన్లు ఉగ్రవాద గ్రూపు అయితే వారితో చర్చలు ఎందుకు జరుపుతున్నారంటూ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాలిబన్లు ఉగ్రవాద గ్రూపా కాదా.. మీరు వాళ్లను ఎలా చూస్తున్నారన్నదానిపై ముందు స్పష్టత ఇవ్వండి. ఒకవేళ వాళ్లు ఉగ్రవాద గ్రూప్ అయితే వాళ్లతో చర్చలు ఎందుకు జరుపుతున్నారు? ఒకవేళ కాకపోతే.. కేంద్రం ఐక్యరాజ్యసమితికి వెళ్లి తాలిబన్లను ఉగ్రవాద సంస్థ జాబితా నుంచి తప్పిస్తుందా? ముందు ఏదో ఒకటి తేల్చుకోండి అని ఒమర్ అన్నారు.
తాలిబన్ల అభ్యర్థన మేరకు ఖతార్లోని భారత రాయబారి దీపక్ మిట్టల్.. వాళ్ల నేత షేర్ మహ్మద్ను మంగళవారం కలిశారు. ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై ప్రధానంగా చర్చించారు. అంతేకాదు ఇండియాకు రావాలనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయులపైనా వీళ్లు సమావేశంలో చర్చించుకున్నారు.