న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్పై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ( Prahlad Joshi ) మరోసారి స్పందించారు. ఆ 12 మంది ఎంపీలను ఎందుకు సభ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందో తాము సభాముఖంగా వివరించామని అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆఖరులో సభలో ఏం జరిగిందనే దానికి యావత్ దేశం సాక్షిగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, సస్పెన్షన్లో ఉన్న ఆ 12 మంది ఎంపీలు క్షమాపణ కోరితే.. వారిపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. వర్షాకాల సమావేశాల చివరలో సదరు ఎంపీలు ప్రవర్తించిన తీరుకు శిక్షగా శీతాకాల సమావేశాల మొదటిరోజే రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే, ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.