ఝార్గ్రామ్, నవంబర్ 15: కేంద్రప్రభుత్వం తమ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల బకాయిలను వెంటనే ఇవ్వకుంటే.. కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులను నిలిపేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాష్ర్టాలకు రావాల్సిన నిధులు ఇవ్వలేని పక్షంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలని ఝార్గ్రామ్లో మంగళవారం ఓ ర్యాలీలో ఆమె డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం రాష్ర్టానికి ఉపాధి హామీ పథకం నిధులు నిలిపేసిందని, ఆ నిధుల కోసం ప్రజలంతా వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ‘మా నిధులు మాకు ఇవ్వటానికి మిమ్మల్ని బిక్షం అడుక్కోవాలా?’ అని నిలదీశారు. నిధుల విడుదలపై ప్రధాని మోదీని కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.