Farmers Protest | న్యూఢిల్లీ, మార్చి 14: కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘాలు వెల్లడించాయి. తమ డిమాండ్లు నెరవేరకపోతే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని, లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఆందోళన కొనసాగిస్తామని కేంద్రాన్ని హెచ్చరించాయి.
ఈ మేరకు గురువారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ‘కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ ఏకగ్రీవంగా తీర్మానించింది. అన్నదాతలకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలపై 2021 వరకు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్రంగా పోరాటం చేశారని, ఆ పోరాటం తర్వాత ఇంత పెద్ద యెత్తున దేశ రాజధానిలో రైతులు సభకు హాజరవ్వడం ఇదే ప్రథమమని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ తదితరులు పేర్కొన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై కర్షక లోకం మండిపడింది. మోదీ వ్యతిరేక నినాదాలతో రామ్లీలా మైదానం దద్దరిల్లింది. ‘కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ సభకు వివిధ ప్రాంతాల నుంచి హాజరైన రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. కాగా ఈ సభకు పలు ఆంక్షలు విధిస్తూ పోలీసులు అనుమతి మంజూరు చేశారు.