మదురై, నవంబర్ 23: రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పేర్కొన్నప్పుడు.. రూ.2.5 లక్షలే వార్షిక ఆదాయం ఉన్నవారి నుంచి ఆదాయపు పన్ను ఎలా వసూలు చేస్తారని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. డీఎంకే సభ్యుడు, రైతు కున్నూరు శ్రీనివాసన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ పిటిషన్ ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. రూ.2.5 లక్షల ఆదాయ పరిమితి మించిన వారందరూ ఆదాయ పన్ను చెల్లించాలని నిర్దేశించే ‘ఫైనాన్స్ చట్టం, ఒకటవ భాగం, ప్యారా ఏ’ను తొలగించాలని శ్రీనివాసన్ తన పిటిషన్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆ నిబంధన రాజ్యాంగంలోని 14, 15, 16, 21, 265 అధికరణాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.
రూ.2.5 లక్షల ఆదాయం పొందే వ్యక్తి పన్ను చెల్లించానడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని నివేదించారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ సత్యనారాయణప్రసాద్తో కూడిన ధర్మాసనం కేంద్ర న్యాయ, ఆర్థిక, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్ల శాఖలకు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు రూ.8 లక్షల ఆదాయ పరిమితి విధించినప్పుడు ఆదాయ పన్ను పరిమితిని కూడా పెంచాలని శ్రీనివాసన్ తన పిటిషన్లో కోరారు. అదే కొలమానం సమాజంలోని అన్నివర్గాల ప్రజలకు వర్తింపజేయాలని సూచించారు. ఏడాదికి రూ.7,99,999 లోపు సంపాదించే వ్యక్తుల నుంచి ఎలాంటి ఆదాయపన్ను వసూలు చేయరాదని డిమాండ్ చేశారు. అలా చేయడం నిర్హేతుకమని, సమానత్వ సూత్రానికి విరుద్ధమని తెలిపారు. రూ.7,99,999 వార్షిక ఆదాయం కలిగిన కుటుంబం ఆర్థిక బలహీనవర్గాల కిందకు వస్తుందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు అర్హత కలిగి ఉంటుందని కేంద్రం పరిమితి విధించడాన్ని శ్రీనివాసన్ గుర్తు చేశారు. అలాంటప్పుడు కేవలం రూ.2.5 లక్షల వార్షిక ఆదాయనికే మిగతా వర్గాలనుంచి ఆదాయపన్ను ఎలా వసూలు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు.