ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మరోసారి మండిపడ్డారు. సీఎం పదవి ఆఫర్ చేస్తే రావణుడి వెంట కూడా శివసేన వెళ్తుందని విమర్శించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాలీసాపై వివాదం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో శివసేన సిద్ధాంతాలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మండిపడ్డారు. ఆ పార్టీ హిందుత్వాన్ని పరోక్షంగా ప్రశ్నించారు. సీఎం పదవిని ఆఫర్ చేస్తే శివసేన ఏ పార్టీ వెంట అయినా వెళ్తుందని ఆరోపించారు. ‘శివసేన నేతలు ఎవరితోనైనా వెళ్తారు. రావణుడు వచ్చి ఐదేళ్లపాటు సీఎం పదవి ఇస్తే ఆయన వెంట కూడా వారు వెళ్తారు’ అని ఎద్దేవా చేశారు.
అధికారం, డబ్బు ఉన్న చోటికి శివసేన వెళ్తుందని నారాయణ్ రాణే విమర్శించారు. మహారాష్ట్రలో గతంలో బీజేపీతో కలిసి అధికారంలో ఉన్న శివసేన ప్రస్తుతం బీజేపీకి దూరమై కాంగ్రెస్, నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మరోవైపు మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పఠనంపై వివాదం రాజుకుంటున్నది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు శనివారం హనుమాన్ చాలీసా పఠిస్తామని స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా ప్రకటించారు. దీంతో వారి ఇంటి ముందు శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు.
అయితే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఆ జంట తెలిపింది. కాగా, మతపరమైన శత్రుత్వాన్ని రేకెస్తున్నారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం సాయంత్రం వారిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఈ మేరకు విమర్శలు చేశారు.