Navjot Sidhu : మాజీ క్రికెటర్ (Ex Cricketer) నవ్జోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ (Punjab Congress) ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని సిద్ధూ సతీమణి నవ్జోత్ కౌర్ సిద్ధూ (Navjot Kaur Siddu) పేర్కొన్నారు.
ఏ పార్టీకి చెల్లించేందుకు తమ వద్ద నిధులు లేవని నవ్జోత్ కౌర్ వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే మాత్రం పంజాబ్ను బంగారు రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. మేం ఎప్పుడూ పంజాబ్, పంజాబియత్ కోసం గళం విప్పుతామని, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి రూ.500 కోట్లు చెల్లించే స్థోమత లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడంపై మాట్లాడేందుకు గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కలిసిన అనంతరం కౌర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వాళ్లను ఎవరు డబ్బు డిమాండ్ చేశారనే విషయాన్ని కౌర్ వెల్లడించలేదు. కానీ, రూ.500 కోట్లు ఇచ్చిన వ్యక్తి సీఎం అవుతాడని వ్యాఖ్యానించారు. సిద్ధూకు ఏ పార్టీ అవకాశం ఇచ్చినా రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తారని అన్నారు.