న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవించి ఉంటే.. బీజేపీని నిషేధించే వారని, ఆ పార్టీ మతపరమైన గుర్తింపును ప్రోత్సహిస్తున్నదని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. జైపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. హిందూత్వం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతను ఆయన వ్యాఖ్యలు బయటపెట్టాయని బీజేపీ పేర్కొన్నది.
ప్రస్తుత రాజకీయ వాతావరణంపై గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశంలో నేటి పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని విమర్శించారు. ‘ప్రస్తుత రాజకీయ చర్చలు మతపరమైన ధ్రువీకరణ ఆధారంగా సాగుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా సమాజంలో విభజనలను పెంచుతున్నారు’ అని ఆరోపించారు. హిందూత్వ పార్టీగా కనిపించాలనే బీజేపీ కోరుకుంటున్నదని, ఇలాంటి విధానాలతో పాలనను కొనసాగించటం సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు.