Kejriwal | న్యూఢిల్లీ : ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జపం చేస్తున్నారని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. నిన్న ఢిల్లీలో నిర్వహించిన మహిళా సమ్మన్ సమరోహ్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.
ఢిల్లీలో మోదీ జపం చేస్తున్న పురుషులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వారి భార్యలపైనే ఉందన్నారు కేజ్రీవాల్. అవసరమైతే మీ భర్తలకు రాత్రి వేళ డిన్నర్ క్యాన్సిల్ చేయండని సూచించారు. 2024-25 బడ్జెట్లో మహిళలకు కొత్త స్కీంను ప్రవేశపెట్టామని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి యువతికి, మహిళకు నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్నామని చెప్పారు. ఉచిత కరెంట్ ఇస్తున్నాం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. వీటితో పాటు ఇప్పుడు నెలకు రూ. 1000 ఇవ్వబోతున్నాం. మరి మీకు బీజేపీ ఏం చేసింది..? అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి..? ఈ సారి కూడా కేజ్రీవాల్కు ఓటేయాలి. ఢిల్లీ ప్రజలకు మీ అన్న కేజ్రీవాల్ అండగా ఉంటారు తప్ప.. ఇతరులు ఎవరూ ఉండరని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ఓటేస్తామని ప్రతి మహిళ తమ ఇంట్లో ప్రతిజ్ఞ చేయించాలి. అంతేకాకుండా ఆప్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.