న్యూఢిల్లీ: గత ఏడాది కాలం నుంచి ఒకవేళ ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం ఇండ్లను కూల్చివేస్తే(House Demolition), వారికి పీఎం ఆవాస్ యోజన కింద కొత్త ఇండ్లను కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ డిమాండ్ చేసింది. ఢిల్లీ మంత్రి అతిషి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సర్కారుకు చెందిన ఏజెన్సీలు గత ఏడాది నుంచి అనేక చోట్ల ఇండ్లను కూల్చివేశాయని అన్నారు. డీడీఏ, ఏఎస్ఐ, రైల్వేస్ లాంటి సంస్థ కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాయన్నారు. సిల్కియారా టన్నెల్ రెస్క్యూ బృందంలో పాల్గొన్న ఓ ర్యాట్ హోల్ మైనర్ ఇంటిని బుధవారం డీడీఏ అధికారులు కూల్చివేశారని, అతనికి కొత్త ఇంటిని కట్టి ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. ర్యాట్ హోల్ మైనర్కు కొత్త ఇళ్లు కేటాయిస్తామని గవర్నర్ చెప్పారని, దాన్ని స్వాగతిస్తున్నామని, అయితే గత ఏడాది నుంచి ఇండ్లు కోల్పోయిన వారికి కూడా కొత్త ఇండ్లను ప్రధాని ఆవాస్ యోజన కింద ఇవ్వాలని మంత్రి కోరారు. ఖాజూరి ఖాస్ ఏరియాలో ఉన్న ర్యాట్ హోల్ మైనర్ వకీల్ హసన్ ఇంటిని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేసింది. ఆ డ్రైవ్ సమయంలో అనేక మంది ఇండ్లను కూడా కూల్చివేశారు. ఇళ్ల కూల్చివేసిన సమయంలో ఆ మైనర్ తన భార్యా పిల్లలతో కలిసి రోడ్డుపై ఉండిపోయాడని, పొరుగు ఇంటి వాళ్ల అతని ఆహారం అందజేసినట్లు మంత్రి తెలిపారు.