CM Siddaramaiah | మైసూరు, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, పదవిలో కొనసాగమంటే కొనసాగుతానని, లేదంటే దిగిపోతానని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా మొదటి రెండున్నరేండ్లు సిద్ధరామయ్య, తర్వాత రెండున్నరేండ్లు డీకే శివకుమార్కు దక్కేలా ఒక అంతర్గత ఒప్పందం జరిగిందనే వార్తలు వచ్చాయి. దీని ప్రకారం రెండున్నరేండ్లు పూర్తైన తర్వాత డీకే శివకుమార్కు పదవి అప్పగిస్తారా అనే ప్రశ్నకు సిద్ధరామయ్య ఈ మేరకు సమాధానం ఇచ్చారు.