న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఈ నెల 6న జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాను గెలిస్తే రాజకీయ పార్టీల మధ్య వారధిని నిర్మిస్తానని ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆమె అన్ని పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖ రాశారు. ‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నేను గెలిస్తే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ఔన్నత్యాన్ని కాపాడుతా. అన్ని పార్టీల మధ్య వారధిగా ఉంటా. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటా. జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కృషిచేస్తా’ అని పేర్కొన్నారు.