న్యూఢిల్లీ: అబ్బా.. మళ్లీ ఇడ్లీయేనా? దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంట్లోనూ పిల్లలు అనే రొటీన్ డైలాగ్ ఇది. తరతరాలుగా పిల్లల పాలిట ఓ విలన్గా మారింది ఈ ఇడ్లీ. నోటికి అస్సలు రుచించని ఈ ఇడ్లీని చూసి ఆమడదూరం పారిపోతారు మన ఇళ్లలో పిల్లలు. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఇడ్లీ( Idli ice cream )ని చూస్తే మాత్రం అలాంటి పిల్లలు కూడా పరుగు పరుగున వచ్చి ఓసారి టేస్ట్ చేద్దామనుకుంటారు.
కాస్త బుర్రకు పని చెప్పాలే కానీ.. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఎన్నో వస్తాయని నిరూపిస్తోంది బెంగళూరులోని ఓ రెస్టారెంట్. అక్కడ ఇడ్లీలను కూడా ఐస్క్రీమ్లలాగా చేసి ఇస్తుండటంతో ఈ బోరింగ్ బ్రేక్ఫాస్ట్ను కూడా పిల్లలు ఎగబడి తింటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. ఇండియా ఇన్నోవేషన్ క్యాపిటల్ బెంగళూరు.. ఎవరూ ఊహించని రంగాల్లోనూ తన క్రియేటివిటీని చూపిస్తోంది. కట్టెపుల్లకు ఇడ్లీ.. దానికి సాంబార్, చట్నీ ఇవ్వడం బాగుందన్నట్లుగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఈ ఫొటో వెంటనే ట్విటర్లో వైరల్గా మారిపోయింది. ఈ ఐడియా అద్భుతంగా ఉన్నదంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్కు ఎంతో మంది స్పందించారు. సడెన్గా చూసి దీనిని ఓ ఐస్క్రీమ్ అనుకున్నా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? మీ పిల్లలకు కూడా ఇడ్లీ తినిపించాలనుకుంటే ఇంట్లో సరదాగా ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేస్తూ ఉండండి.