అమృత్సర్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధాంతాలు వేరు, తమ పార్టీ సిద్ధాంతాలు వేరని, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్తో పొత్తు ఉండబోదని పంజాబ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆప్తో కాంగ్రెస్ పార్టీ పొత్తుపెట్టుకుందా..? అన్న మీడియా ప్రశ్నకు సిద్ధూ పైవిధంగా స్పందించారు. వేర్వేరు సిద్ధాంతాలు కలిగివున్న రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యపడదని ఆయన వ్యాఖ్యానించారు.
తాను ఎప్పుడూ నీతి నిజాయితీ కోసమే పోరాటం చేస్తానని, ఎప్పటికీ నీతి తప్పనని సిద్ధూ చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాను ధైర్యంగా ముందడుగు వేస్తానని, నైతిక విలువల విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ సారథ్యంలో పోటీపడిన కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆప్ ఘన విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది.