న్యూఢిల్లీ, జూలై 17: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల తుది ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 99.97 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) వెల్లడించింది. ఫలితాల్లో 99.8% మార్కులతో నలుగురు విద్యార్థులు టాప్ ర్యాంకులో మెరిశారు. టాప్ ర్యాంకు సాధించిన వారిలో హర్గుణ్ కౌర్(పుణె), అనికా గుప్తా(కాన్పూర్), పుష్కర్ త్రిపాఠి(బలరాంపూర్), కనిష్క మిట్టల్(లక్నో) ఉన్నారు. అలాగే, 34 మంది విద్యార్థులు 99.6% మార్కులతో సెకండ్ ర్యాంకులో నిలిచారు. 99.4% మార్కులతో 72 మంది మూడో స్థానాన్ని పంచుకున్నారు. బాలికల ఉత్తీర్ణత 99.98% కాగా, బాలురు 99.97% మంది పాస్ అయ్యారు. ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలను cisce.org లేదా results.cisce.org లో చెక్ చేసుకోవచ్చు. తుది ఫలితాల్లో రెండు సెమిస్టర్లకు సమాన వెయిటేజీ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.