న్యూఢిల్లీ : ఇండియన్ కోస్ట్గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు. శ్రీలంక నుంచి సముద్రమార్గంలో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కోస్ట్గార్డ్, చైన్నై డీఆర్ఐ శాఖ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రూ.10.50 కోట్ల విలువైన 17.74 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
ఈ నెల 7 నుంచి ఇండియన్ కోస్ట్గార్డ్ ఇంటర్సెప్టర్ బోట్ (IB) C-432లో ప్రత్యేక నిఘా బృందాన్ని మోహరించింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్లో రెండు రోజులుగా నిఘా వేయగా.. ఈ నెల 8న అనుమానాస్పద పడవ కదలికలను గుర్తించారు. కోస్ట్గార్డ్ పట్టుకునేందుకు ప్రయత్నించగా.. తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత పడవను ఆపి తనిఖీలు నిర్వహించగా ఏమీ దొరకలేదు. అయితే, అడ్డుకునే సమయంలో నీటిలో పడవేసి ఉంటారన్న అనుమానంతో.. సముద్రంలో డైవింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిషింగ్ బోట్ను స్వాధీనం చేసుకోవడం పాటు ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది..