న్యూఢిల్లీ: కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారితోపాటు ఆయన భార్యను వేర్వేరు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజీవ్ ఖిర్వార్ సాయంత్రం వేళ పెంపుడు కుక్కతో కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే త్యాగరాజ స్టేడియానికి వాకింగ్కు వెళ్లేవారు. అయితే దీని కోసం స్టేడియం సిబ్బంది క్రీడాకారులను రాత్రి ఏడు గంటలకు ముందుగానే ఖాళీ చేయించేవారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది మీడియా దృష్టికి వచ్చింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు. క్రీడాకారుల కోసం స్టేడియాల పని సమయాన్ని రాత్రి పది గంటల వరకు పొడిగించారు.
మరోవైపు ఈ ఘటనను కేంద్ర హోం శాఖ కూడా సీరియస్గా తీసుకుంది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సీఎస్ నరేశ్ కుమార్ను ఆదేశించింది. అలాగే ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను లడఖ్కు, ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గను అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేసింది.
కాగా, హాస్య నటుడు వీర్ దాస్ దీనిపై ఒక జోక్ వేశారు. ‘ఆ కుక్క లడఖ్లో వంద మీటర్లను రికార్డు టైమ్లో పరుగెత్తడం నేను చూసి చాలా ఆశ్చర్యపోయా. రియల్ అథలెట్. అది ఎక్కడ శిక్షణ పొందిందో నాకు తెలియదు..’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆ ఐఏఎస్ అధికారి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు ఆయన ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా కామెంట్ చేశారు. ఆ దంపతులు ఉన్న చోటకు నిన్ను ఎలా అనుమతించారు, లడఖ్ సెక్యూరిటీ సిబ్బంది వారి జాబ్ చేయడం లేదా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
Amazing. I was just out for a run in Ladakh. I saw a dog run 100meters in record time. Really athletic. Not sure where the dog has been training, but very very impressive.
— Vir Das (@thevirdas) May 27, 2022