న్యూఢిల్లీ : సమాజంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందని కండ్లకు కట్టేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పాత దుస్తులను ఏరుకుని పొట్టపోసుకునే 75 ఏండ్ల బామ్మకు ఓ బ్లాగర్ ఆసరాగా నిలిచి కొత్త జీవితాన్ని ఇచ్చిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేయగా ఇప్పుడది ఆన్లైన్లో తెగ వైరలవుతోంది.
Humanity.🙏🙏🙏 pic.twitter.com/NUZTGEB6Cp
— Awanish Sharan (@AwanishSharan) October 18, 2022
బ్లాగర్ తొలుత ఈ వీడియోను తన ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా పది లక్షలకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను తరుణ్ మిశ్రా అనే బ్లాగర్ రికార్డు చేశారు. ఈ వీడియోలో వృద్ధురాలు డంపింగ్ యార్డ్లో పాత దుస్తుల ముక్కలను ఏరుకుంటూ కనిపిస్తుంది. తాను ఈ చెత్తను సేకరించి పొట్టపోసుకునేందుకు విక్రయిస్తానని చెబుతుండటం వినిపించింది. ఆమెను కూరగాయల విక్రేతగా నూతన జీవితం ప్రారంభించేలా తరుణ్ సాయం అందిస్తాడు.
వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన వెయింగ్ మెషిన్, కూరగాయల బండి, తాజా కూరగాయలను దగ్గరుండి సమకూరుస్తాడు. ఆమెకు అవసరమైన నిత్యావసరాలనూ అతడు కొనుగ్ోలు చేస్తాడు. బామ్మను అక్కున చేర్చుకుని ఆసరాగా నిలిచిన బ్లాగర్ను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని ఓ యూజర్ కామెంట్ చేయగా, వావ్..బ్యూటిఫుల్ అంటూ మరికొందరు అతడి ఔదార్యాన్ని మెచ్చుకున్నారు.