న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచంతోపాటు భారత్పైనా ప్రభావం చూపుతున్నది. వాయు శక్తి విన్యాసాలను భారత వాయుసేన (ఐఏఎఫ్) వాయిదా వేసింది. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్లోని పోఖ్రాన్ రేంజ్లో ఈ నెల 7 నుంచి మెగా వాయు శక్తి విన్యాసాలు జరుగనున్నాయి. అయితే వీటిని వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, వాయిదాకు కారణాలను వెల్లడించలేదు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు మూడేండ్లకు ఒకసారి వాయు శక్తి పేరుతో వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. 2019లో చివరిగా ఈ విన్యాసాలు జరిగాయి.
కాగా, ఈ ఏడాది మార్చి 7న వాయు శక్తి విన్యాసాలు నిర్వహించేలా షెడ్యూల్ను ఖరారు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఐఏఎఫ్లోని మొత్తం 148 యుద్ధ విమానాలు తమ సత్తా చాటనున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్, అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ 17, సీ 130 జే రవాణా విమానాలు తొలిసారి ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. అలాగే దేశీయంగా అభివృద్ధి చేసిన తేజాస్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్తోపాటు జాగ్వార్, సుఖోయ్-30, మిగ్-29 వంటి అనేక ఇతర విమానాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నెలలో బ్రిటన్లో జరుగాల్సిన బహుళ వైమానిక విన్యాసాలు ‘కోబ్రా వారియర్’ నుంచి భారత్ తప్పుకున్నది. దీంతో ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లిన యుద్ధ విమానాలను ఐఏఎఫ్ వెనక్కి రప్పించింది.