న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సెషన్ సందర్భంగా ఎంపీలందరికీ ఆయన స్వాగతం పలికారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో.. ఇండియాకు ఎన్నో అవకాశాలు కలిసి వస్తున్నాయన్నారు. దేశ ఆర్థిక ప్రగతి, వ్యాక్సినేషన్ ప్రక్రియ, మేడియన్ ఇండియా వ్యాక్సిన్లతో భారత్ దూసుకువెళ్తోందని, ఆ విషయం ఈ సెషన్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని మోదీ అన్నారు. ఈ బడ్జెట్ సెషన్లోనూ అనేక సమస్యలు, అంశాలపై చర్చలు నిర్వహించాలన్నారు. ఓపెన్ మైండ్తో చర్చలు జరగాలన్నారు.
ఎంపీలు, రాజకీయ పార్టీలు ఓపెన్ మైండ్తో చర్చలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ చర్చల ద్వారా దేశాన్ని అభివృధ్ధి పథంలో నడుపుతారని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వల్ల సమావేశాలు, చర్చలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, కానీ బడ్జెట్ సెషన్ ద్వారా ఏడాదికి సంబంధించిన బ్లూ ప్రింట్ను తయారు చేయాలన్నారు. సమావేశాలు ఎంత సజావుగా సాగితే, అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటుందని మోదీ తెలిపారు.