న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పెషల్ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్లో రాఘవ్ చద్దా పేరు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రాఘవ్ చద్దా కొట్టిపారేశారు. ఈడీ కోర్టుకు సబ్మిట్ చేసిన ఏ ఫైల్లో కూడా తన పేరును నిందితుడిగాగానీ, అనుమానితుడిగాగానీ చేర్చలేదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరో తన పేరును చెడగొట్టడానికి ఇలాంటి దుష్ప్రచారం చేశారని చద్దా విమర్శించారు. ఈ అబద్ధపు ప్రచారాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు. అన్ని రకాల మీడియా సంస్థలకు, ముద్రణా సంస్థలకు తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, ఏదైనా విషయాన్ని పబ్లిష్ చేసేటప్పుడు దాని వెనకున్న నిజానిజాలను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.