శ్రీనగర్: హిజాబ్ అంశంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్కు చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ వివాదంపై తాజాగా స్పందించారు. శ్రీనగర్లో మీడియాతో ఆదివారం ఆమె మాట్లాడారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, హిజాబ్ అంశాన్ని వివాదస్పదం చేయడంపై మండిపడ్డారు. బీజేపీ ఒక్క హిజాబ్తో ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింల ఇతర చిహ్నాలను కూడా వారు (బీజేపీ) లక్ష్యంగా చేసుకుంటారని, అన్నింటిని తొలగిస్తారంటూ దుయ్యబట్టారు. భారతీయ ముస్లింలు భారతీయులుగా ఉంటే సరిపోదని, వారు బీజేపీ వ్యక్తులై ఉండాలని ఎద్దేవా చేశారు. జమ్ముకశ్మీర్ రాజకీయ అంశాన్ని కమ్యూనిటీ అంశంగా మార్చాలని బీజేపీ భావిస్తున్నదంటూ మండిపడ్డారు.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కూడా హిజాబ్ అంశంపై ఆదివారం స్పందించారు. పుల్వామాలో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ ఇష్టానుసారం ధరించే, తినే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. అలాగే వారి మత విశ్వాసాలను ఆచరించే స్వేచ్ఛ కూడా ఉందన్నారు. అయితే మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు రాడికల్ ఎలిమెంట్స్ ఒక మతంపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.