రామగిరి, మే 3 : బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడంతోపాటు సర్కారు స్కూళ్ల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది జనవరిలో 14 ఏండ్లలోపు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించింది. ప్రస్తుతం 15 నుంచి 19 ఏండ్ల వయస్సు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ప్రభుత్వం భావించి వారిని స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించేందుకు సిద్ధమైంది. వారికి చదువుతోపాటు వసతి, ఆర్థికసాయం అందించేలా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీనికోసం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంటింటి సర్వే చేపడుతున్నారు.
గుర్తించేది వీరినే..
ఈ సంవత్సరం జనవరిలో 6 నుంచి 14 ఏండ్ల బడి బయటి పిల్లల సర్వే పూర్తి చేశారు. ప్రస్తుతం 15-19 ఏండ్ల బడి బయటి విద్యార్థులు అంటే 2002 నుంచి 2009 మధ్య జన్మించిన విద్యార్థుల వివరాల సేకరణకు శ్రీకారం చుట్టారు. గుర్తించిన విద్యార్థులను ఓపెన్ స్కూల్, దూర విద్య అధ్యయన కేంద్రాల్లో వారి అర్హతను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్లో చేర్పించనున్నారు. ఇందుకు అయ్యే ఫీజులను ప్రభుత్వం రూ.2వేలు అందించి సహకరించనుందని తెలుస్తుంది. ఇది విద్యార్థులకు ఎంతో మేలు చేయనుంది.
విద్యాశాఖ ఉద్దేశం ఇదే…
ప్రతి ఒక్కరూ కనీసం పదో తరగతి పూర్తయితే అంటెండర్ మొదలుకొని క్లర్క్ స్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే పోలీసు, బ్యాంకింగ్, ఇతర ప్రభుత్వ శాఖల్లో కొలువులకు అర్హులవుతారు. డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు తాజా సర్వే దోహదం చేస్తుందని విద్యాశాఖ ఉద్దేశం.
28 అంశాల సర్వే పత్రంతో..
సీఆర్పీలు 28 అంశాలతో కూడిన పత్రంతో కొవిడ్ నిబంధనలతో ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. సర్వే పత్రంలో విద్యార్థి తల్లిదండ్రులు వివరాలు, ఆధార్ సంఖ్యతోపాటు పూర్తి చిరునామా, మాతృభాష, మధ్యలో బడి మానేయడానికి గల కారణాలు వంటివి ఉన్నాయి. ఇలా 15-19 సంవత్సరాల పిల్లలను కలుస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అదే విధంగా సీడబ్ల్యూఎస్ఎన్ (ప్రత్యేక అవసరాలు గల) పిల్లలు కూడా ఉంటే నిర్ధారణ చేస్తున్నారు. మరో పర్యాయం 6నుంచి 14 ఏండ్లలోపు బడిబయటి పిల్లల వివరాలను కూడా తీసుకుంటున్నారు. సర్వే నివేదికను మండల వనరుల కేంద్రానికి, అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖ-సమగ్రశిక్షకు అందించనున్నారు.