న్యూఢిల్లీ: కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్ కోసం నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె లోక్సభలో బుధవారం మాట్లాడారు. భారతదేశం తన సంస్కృతి, సాంస్కృతిక వారసత్వం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమమైనదని కొనియాడారు. మన సంస్కృతి, కళలు, కళాకారులు దానికి పునాదని తెలిపారు. ఏ దేశమైనా కళాకారులను నిర్లక్ష్యం చేస్తే దానిని తిరస్కరించాల్సిందేనని ఆమె అన్నారు.
కాగా, ప్రస్తుతం దేశంలో కళారంగం, కళాకారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఎంపీ హేమా మాలిని వాపోయారు. ఒక కళాకారిణిగా వారి గురించి తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు. మన జానపద, శాస్త్రీయ కళాకారులు, ఇతర కళాకారుల గుర్తింపు ప్రమాదంలో పడిందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా కళాకారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారు తమ కళను వదిలి జీవనోపాధి కోసం తమకు అనుభవం లేని ఇతర ఉద్యోగాలు చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్ కోసం ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
2017లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కళలు, కళాకారుల గురించి సమాచారాన్ని సేకరించేందుకు నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ పథకాన్ని ప్రారంభించిన సంగతిని ఎంపీ హేమా మాలిని గుర్తు చేశారు. అయితే వనరుల కొరత కారణంగా దీనిని మూసివేసినట్లు తాజా సమాచారం ప్రకారం తెలుస్తున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులను అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు.