ముంబై: శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన ఏక్నాథ్ షిండేపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఏక్నాథ్ షిండేకు దమ్ముంటే తన తండ్రి థాకరే పేరును వాడుకోకుండా వచ్చే ఎన్నికల్లో ఆయన తండ్రి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి గెలువాలని సవాల్ చేశారు.
గత ఎన్నికల్లో శివసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తారా..? అన్న ప్రశ్నకు ఆయన లేదని సమాధానం ఇచ్చారు. పార్టీ ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయి ఉందని, వాటికి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు కూడా ఉన్నదని, ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకునే వాళ్లు (ఏక్నాథ్ షిండే వర్గం) పార్టీ పేరును, గుర్తును దక్కించుకున్నారని ఉద్ధవ్ చెప్పారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే ఛాలెంజ్ చేశామని అన్నారు.
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 55 స్థానాలు గెలిచింది. బీజేపీతో విభేదించి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహాకూటమి సర్కారును ఏర్పాటు చేసింది. అయితే సీనియర్ నేత ఏక్నాథ్ షిండే శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ పంచన చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో అసలైన శివసేన ఎవరిదనే వివాదం మొదలైంది. ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దాంతో గత ఉపఎన్నికల సందర్భంగా రెండు వర్గాలు తాత్కాలిక గుర్తులను కేటాయించిన ఈసీఐ.. ఇటీవల అసలైన శివసేన ఏక్నాథ్ షిండే వర్గానిదేనని తేల్చిచెప్పింది. ఈసీ తీర్పుపై ఉద్ధవ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది.