లక్నో: ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నానని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెయిన్పురిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులు, యువత, వ్యాపారవేత్తలు దేశాన్ని బలోపేతం చేస్తారని చెప్పారు. ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, అభివృద్ధికి తాము కృషి చేస్తామని మీకు హామీ ఇస్తున్నానని అన్నారు.
కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య గత కొంత కాలంగా దూరం బాగా పెరిగింది. ఇటీవల ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు బీజేపీలో చేరారు. దీనికి ముందు ఆమె ఆయన నుంచి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ములాయం సింగ్ యాదవ్ దూరంగా ఉంటారని అంతా భావించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెయిన్పురిలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. ఈసారి ప్రధానంగా నాలుగు పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బీజేపీ, ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి, మాయవతికి చెందిన బీఎస్పీతోపాటు కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.