అల్వార్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ గత కొన్నాళ్లుగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్కు చేరింది. ప్రస్తుతం రాజస్థాన్లో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నది. కశ్మీర్లో ఈ యాత్ర ముగియనుంది.
ఈ క్రమంలో రాహుల్గాంధీ పాదయాత్రపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాహుల్గాంధీ యాత్ర ఎందుకు చేస్తున్నట్టో అని ఎద్దేవా చేస్తున్నారు. పాదయాత్రలతో ఓట్లు రాలవని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. దాంతో గత రాత్రి రాజస్థాన్లోని అల్వార్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బీజేపీ వ్యాఖ్యల గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాహుల్గాంధీ సెటైరికల్గా సమాధానం చెప్పారు. విద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఒక మార్కెట్గా, తన పాదయాత్రను ఆ విద్వేష మార్కెట్లో ప్రేమను నింపే ఒక దుకాణంగా పోల్చి సమాధానమిచ్చారు. తాను విద్వేష మార్కెట్లో ప్రేమను పంచే ఒక దుకాణం తెరిచానని వ్యాఖ్యానించారు.