తానేమీ పిరికిపంద కానని, తనకు అస్సలు భయమే లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తాను యోధురాలినని చెప్పుకొచ్చారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమతా బెనర్జీ గురువారం వారణాసిలో సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తానెవ్వరికీ భయపడనని స్పష్టం చేశారు. తన జీవితంలో బుల్లెట్ దెబ్బలను కూడా చవిచూశానని, కానీ ఎవ్వరి ముందూ తలవంచలేదన్నారు. వారణాసి పర్యటన సమయంలో హిందూ యువ వాహిని కార్యకర్తలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని, అయినా.. ధైర్యంగా కారుదిగి, వారి ముందు నిల్చున్నట్లు తెలిపారు. వారే పిరికిపందలంటూ మమత విరుచుకుపడ్డారు. నిన్న ఎయిర్ పోర్ట్ నుంచి దశాశ్వమేథ ఘాట్కు వెళ్తున్నా.. కొందరు బీజేపీ కార్యకర్తలు వచ్చారు. పోకిరీతనంతో వ్యవహరిస్తూ.. నా కారును అడ్డుకున్నారు. నా కారును కట్టెలతో కొడుతూ.. గో బ్యాక్ అంటూ హెచ్చరించారు. తర్వాత వారే వెళ్లిపోయారు. అంటూ మమత పేర్కొన్నారు.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ తరపున ప్రచారం చేయడానికి బెంగాల్ సీఎం మమత వారణాసి చేరుకున్నారు. ఈ సందర్భంగా దశాశ్వమేథ్ ఘాట్కు వెళ్తున్నారు. ఈ సమయంలో హిందూ యువ వాహినీ కార్యకర్తలు ఆమెకు నల్ల జెండాలు చూపిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ నినదించారు. దీంతో సీఎం మమత తన కారులోంచి దిగి, ఏకంగా వారి ముందు నిలుచున్నారు.