ముంబై: తాను వృద్ధుడ్ని కాదని మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. కొంతమందిని సరిదిద్దే శక్తి ఉందని తెలిపారు. డిసెంబర్ 12న శరద్ పవార్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పూణేలోని చర్కోలీలో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు. దీనిని తిలకించిన శరద్ పవార్ ఈ సందర్భంగా మాట్లాడారు. తన వయసు 83, 84 ఏళ్లుగా పేర్కొంటూ, ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్న ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ వంటి వారిపై పరోక్షంగా మండిపడ్డారు. ‘మీరు నాలో ఏమి చూశారు? నాకు వృద్ధాప్యం రాలేదు. నాలో శక్తి సడలలేదు. నేను కొంతమందిని సరిదిద్దగలను. మీరు చింతించకండి’ అని జనాన్ని ఉద్దేశించి అన్నారు. అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీ రెండు వర్గాలుగా వీడటంపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కాగా, ఎడ్ల బండ్ల పోటీలు వంటి క్రీడలు రైతులకు సంతృప్తిని, విశ్వాసాన్ని ఇస్తాయని శరద్ పవార్ తెలిపారు. సరైన నిర్ణయం తీసుకుంటే ఈ పోటీని ఒలింపిక్స్లో కూడా చేర్చవచ్చని అన్నారు. అధికారంలో ఉన్నవారికి రైతులపై ప్రేమాభిమానాలు లేవని విమర్శించారు. ఉల్లితో సహా కొన్ని ఉత్పత్తులపై ఎగుమతి నిషేధం వంటి నిర్ణయాలే దీనికి ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వం రైతులకు సహాయం చేయడానికి బదులు అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.