జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతో ఈసారి గెలుస్తామని పైలట్ చెప్పారు. రాజస్థాన్లో 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైంది.
అయితే, సీఎం పదవిని ఆశించిన సచిన్ పైలట్కు భంగపాటు ఎదురు కావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా సీఎం, డిప్యూటీ సీఎం మధ్య క్రమంగా విభేదాలు పెరిగాయి. ఒక దశలో గొడవ మరింత ముదరడంతో సచిన్ పైలట్ బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ, రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ నచ్చజెప్పడంతో ఆగిపోయారు.
కానీ, సచిన్ పైలట్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలిగారు. గెహ్లాట్ సర్కారు తీరుపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అధిష్ఠానం ఆజ్ఞ మేరకు అగ్ర నేతలిద్దరూ వ్యక్తిగత విబేధాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేస్తున్నారు. రాజస్థాన్లో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.