లక్నో, జూన్ 11: అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం, నిధుల చోరీకి సంబంధించి అనేక విషయాలు తనకు తెలుసునని బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం దీని గురించి మాట్లాడటానికి తాను సిద్ధంగా లేనని అన్నారు. బుధవారం ఆయన విష్ణోహార్పూర్లోని తన నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘అటు వైపు చాలా శక్తివంతమైన వ్యక్తులున్నారు. నేను నిజాలు మాట్లాడితే చిక్కుల్లో పడటం ఖాయం’ అని అన్నారు.
రామ మందిరం కోసం కానుకల రూపంలో వచ్చిన కోట్ల రూపాయలు కనిపించకుండా పోయాయని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాలు విషయాన్ని సుమోటాగా స్వీకరించి, విచారణ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. రామ మందిరానికి అకౌంట్స్ ఇన్చార్జిగా పనిచేశానని చెప్పుకొంటున్న మహిపాల్ సింగ్, విరాళాల సేకరణలో చాలా కాలంగా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడంతో కుంభకోణం మరింత తీవ్రమైంది. ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినందుకే తనను పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.