న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన రాజ్యసభలో గురువారం కాస్త నవ్వులు వెల్లివిరిశాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్, బుధవారం కోపంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. దీంతో కొంత మంది సభ్యులు నవ్వుకున్నారు. ధంకర్ కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘నాకు పెళ్లై 45 ఏండ్లు దాటింది (Married For 45 Years). నేను ఎప్పుడూ కోపంగా లేను’ అని అన్నారు. దీంతో సభ మరోసారి నవ్వులతో మారుమోగింది.
కాగా, ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం గురించి ధంకర్ ప్రస్తావించారు. ‘చిదంబరం చాలా విశిష్టమైన సీనియర్ న్యాయవాది, ఆయనకు ఇది తెలుసు. సీనియర్ న్యాయవాదిగా, కనీసం అధికార యంత్రాంగంపై కోపాన్ని చూపించే హక్కైనా మాకు లేదు. మీరు (ఖర్గే) కూడా ఒక అధికారే సార్’ అని అన్నారు. అలాగే తాను కోపగించుకున్నానన్న వ్యాఖ్యను ఖర్గే సవరించుకోవాలని కోరారు.
మరోవైపు ఖర్గే బదులిస్తూ.. ‘మీరు దానిని (కోపాన్ని) చూపించరు. కానీ లోపల మాత్రం కోపంగా ఉంటారు’ అని అన్నారు. దీంతో రాజ్యసభలో మరోసారి నవ్వులు హోరెత్తాయి. రాజ్యసభ చైర్మన్ ధంకర్ కూడా నవ్వుకున్నారు. అనంతరం మణిపూర్ అంశంపై సభలో చర్చకు ఖర్గే పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చర్చకు సంబంధించిన 267, 176 నిబంధనలపై ఖర్గే, ధంకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది.