Jaipur Express | హైదరాబాద్ : రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి ముంబైకి వెళ్తున్న జైపూర్ ఎక్స్ప్రెస్లో నిన్న తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్కు చెందిన సయ్యద్ సఫియుల్లా ఉన్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ కోరారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత జైపూర్ ఎక్స్ప్రెస్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ ఆటోమేటిక్ వెపన్తో కాల్పులకు పాల్పడిన విషయం విదితమే. చేతన్ సింగ్ మొదట బీ5 కోచ్లో ఉన్న సీనియర్ అధికారి ఏఎస్ఐ టికా రామ్ మీనాను కాల్చి చంపాడు. తర్వాత మరో బోగీలోకి వెళ్లి ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరపడంతో, వారు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దహిసర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు చేతన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.