Liberation Day : నిజాం రాజుపై సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన రోజైన సెప్టెంబర్ 17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ లిబరేషన్ డే (Hyderabad Liberation Day)’ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ లిబరేషన్ డేను పురస్కరించుకుని ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్లో తెలిపింది.
‘భారతదేశం స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్ సంస్థానం 13 నెలలపాటు నిజాంల పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్య (ఆపరేషన్ పోలో) తో ఈ ప్రాంతం భారత్లో విలీనమైంది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశభక్తి నింపడానికి సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ లిబరేషన్ డే’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని హోం మంత్రిత్వశాఖ తన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నది.