లక్నో: ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహం పక్కనే అతడు పడుకున్నాడు. (Husband Murders Wife) ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. మంజు గోలా, గోవింద్ మోతీకి 14 ఏళ్ల కిందట పెళ్లైంది. వారికి ముగ్గురు పిల్లలు. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా మంజు పని చేస్తుండగా గోవింద్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్.
కాగా, భార్య మంజుకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త గోవింద్ అనుమానించాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య తరచుగా గొడవ జరుగుతున్నది. దీంతో భార్యను చంపేందుకు గోవింద్ కుట్రపన్నాడు. ఈ నెల 15న ముగ్గురు పిల్లలను వేరే ప్రాంతానికి పంపాడు. అర్ధరాత్రి తర్వాత నిద్రిస్తున్న భార్య మంజును కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహం పక్కనే పడుకున్నాడు.
మరోవైపు ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఇంటికి చేరుకుని పరిశీలించారు. భార్య మంజును హత్య చేసి అక్కడే ఉన్న భర్త గోవింద్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.