లాతూర్, నవంబర్ 17: విద్యార్థుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగించే అధ్యాపకులు ఈ ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం కారణంగా ‘చీకటి దీపావళి’ జరుపుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వందలాది విజిటింగ్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 11 నెలల ఒప్పంద ప్రతిపాదికన నియమితులైన తమకు జీతాలు రాకపోవడంతో బలవంతంగా చీకటి దీపావళి జరుపుకోవాల్సి వచ్చిందని లాతూర్లోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఒకరు వాపోయారు.
‘మేము ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు లాంటివి చెల్లించాలి. కానీ మాకెలాంటి సాయం లభించడం లేదు’ అని సుధీర్ సులంకే అనే లెక్చరర్ తెలిపారు. దీనిపై సాంకేతిక విద్య జాయింట్ డైరెక్టర్ ఉమేశ్ నగ్దెవె స్పందిస్తూ సంబంధిత కళాశాలలు జీతాల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. విజిటింగ్ లెక్చరర్లకు జీతాలిచ్చే కాలేజీల పర్సనల్ లెడ్జర్ అకౌంట్లో నిధులు తక్కువగా ఉండటమే జీతాలు చెల్లించకపోవడానికి కారణమని ఓ కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.