భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్(Union Minister Prahlad Singh Patel)కు వ్యతిరేకంగా స్థానికులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అన్ని పార్టీల నేతలతో పాటు వందల సంఖ్యలో ప్రజలు కూడా కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళిత వ్యక్తి ఆత్మహత్య కేసులో మంత్రి జోక్యం చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దామోహ్ పట్టణానికి చెందిన విక్రమ్ రోహిత్ అనే వ్యక్తి తన పీడీఎస్ షాపులోనే బలన్మరణానికి పాల్పడ్డాడు. కేంద్ర మంత్రి పటేల్ అనుచరుల వత్తిడి వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు విక్రమ్ సూసైడ్ నోట్లో తెలిపాడు. తనకు చెందిన పీడీఎస్ షాపును స్వాధీనం చేసుకునేందుకు మంత్రి మద్దతుదారులు వేధించినట్లు సూసైడ్ లేఖలో విక్రమ్ పేర్కొన్నాడు.
ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టడంతో.. పోలీసులు ఆ కేసులో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ఇద్దరు మంత్రి అనుచరులు ఉన్నారు. ఎస్సీ-ఎస్టీ చట్టం, ఐపీసీలోని 306 చట్టం కింద వాళ్లను అరెస్టు చేశారు. అయితే తన మద్దతుదారుల అరెస్టుపై మంత్రి స్పందించారు. పోలీసులు తొందరపడి చర్య తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సూసైడ్ నోట్ను నిపుణులతో పరిశీలించకుండా వేగంగా చర్యను తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దామోహ్ పోలీసుల చర్యను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన నేతలు, వేలాది మంది ప్రజలు కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా సుమారు రెండు కిలోమీటర్ల మేర మార్చ్ నిర్వహించారు. దామోహ్ జిల్లాలో కేంద్ర మంత్రి పటేల్.. మరో బీజేపీ నేత మాలియా కుటుంబం మధ్య చాన్నాళ్ల నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది. దామోహ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ లోధీ గెలిచేందుకు సహకరించినట్లు పటేల్పై ఆరోపణలు కూడా ఉన్నాయి.