నల్లజెండాలు ప్రదర్శించిన వివిధ పార్టీల కార్యకర్తలు
మయిలదుతురై, ఏప్రిల్ 19: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి నిరసన సెగ తగిలింది. మంగళవారం ధర్మపురం ఆధీనం మఠానికి వెళ్లిన ఆయనకు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ బిల్లు విషయంలో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. రాష్ట్రంలో నీట్ పరీక్షకు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసి రెండోసారి పంపినప్పటికీ గవర్నర్ రవి దానిని తిరస్కరించారు.
దీంతో రాజ్భవన్ను ప్రభుత్వం బహిష్కరించింది. ఈ నేపథ్యంలో గవర్నర్కు విదుతలై చిరుతైగల్ కట్చి, వామపక్షాలకు చెందిన పలువురు కార్యకర్తలు నిరసన తెలిపినట్టు సమాచారం. మఠంలో గవర్నర్కు బీజేపీ నేతలు సాదర స్వాగతం పలికారు. గవర్నర్కు నల్లజెండాలతో నిరసన తెలుపటాన్ని బీజేపీతోపాటు ప్రతిపక్ష అన్నాడీఎంకే తప్పుబట్టింది.