న్యూఢిల్లీ, నవంబర్ 13: విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ విద్యుత్తు రంగ ఇంజినీర్లు, ఉద్యోగులు కదం తొక్కనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆదివారం ప్రకటించింది. విద్యుత్తు పంపిణీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు గత చట్టానికి సవరణలు రూపొందించారు. 2022 ఆగస్టు 8న లోక్సభలో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టింది.
అదేరోజు చర్చలు, సంప్రదింపుల కోసం ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపింది. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పరిశీలనకు, ఆమోదానికి పంపనున్నారు. కాగా, ఈ బిల్లును ప్రతిపక్షాలతోపాటు విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించబోయే ర్యాలీకి దేశవ్యాప్తంగా వేల మంది విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగులు తరలివస్తారని ఏఐపీఈఎఫ్ తెలిపింది. ఈ ర్యాలీ రాంలీలా మైదానం నుంచి ప్రారంభమై జంతర్మంతర్ వరకు సాగుతుందని పేర్కొన్నది.