భోపాల్: ఒక హైవేపై మూడు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముంబై-ఆగ్రా నాలుగు లేన్ల జాతీయ రహదారిలోని గణేష్ ఘాట్ వద్ద శనివారం మూడు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. ముంబై వైపు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు డివైడర్ను దాటి పక్కనున్న లేన్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో రెండు లారీలను అది ఢీకొట్టింది. కార్లు, గ్రానైట్, ఇతర పార్సిల్ లోడ్ ఉన్న లారీలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఢీకొట్టిన లారీ హైవేపై బొల్తాపడింది. దీంతో కొంతసేపు ఆ మార్గం మూసుకుపోయింది.
కాగా, సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. రెండు లారీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని ధన్మోద్ ప్రభుత్వ ఆసుపత్రికి అతడ్ని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరి మృతదేహాలను కూడా పోస్ట్మార్టం కోసం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘాట్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిన చోట ‘నెమ్మదిగా వెళ్లు, సురక్షితంగా ఉండు’ అన్న జాగ్రత్తలు సూచించే ఒక సైన్బోర్డు కూడా ఉండటం విశేషం.
Two heavy vehicles collided near Ganesh Ghat before catching fire. #dhar pic.twitter.com/LqpbO1i9YP
— JD Jansampark Indore (@jdjsindore) March 11, 2023